బాబు ఎలా ఓడారు.. జ‌గ‌న్ ఎందుకు గెలిచాడు!

ఇప్పుడెందుకీ క‌థ అనుకోవ‌చ్చు. కానీ.. వైసీపీ ఏడాది పాల‌న సూప‌ర్ అంటూ పండుగ‌. టీడీపీ ఆత్మ‌విమ‌ర్శ‌కోసం మ‌హానాడు త‌ల‌పెట్టాయి. ఈ సంద‌ర్భంగా ఒక్క‌సారి మ‌న‌మూ స్మ‌రించుకుందాం. రెండూ నాణేనికి ఉండే బొమ్మ‌,బొరుసులు. కానీ.. అక్క‌డే ఆటగాడి నైపుణ్యం.. గెలిచేవాడి తెలివితేట‌లు ఆధార‌ప‌డి ఉంటాయి. పోటీప‌డిన వాడు గెలిచాడంటే.. అది కేవ‌లం అత‌డి గొప్ప‌త‌న‌మే కాదు.. ప్ర‌త్య‌ర్థుల బ‌ల‌హీన‌త కూడా కావ‌చ్చు. ఏపీలో చాలా సార్లు.. రాజ‌కీయాల్లో ఇవే జ‌రుగుతుంటాయి. జ‌రిగాయి.. మున్ముందు ఇవే జ‌రుగుతాయి. ఎంతైనా సెంటిమెంట్‌ను న‌మ్మేవారు క‌దా! అందాకా ఎందుకు.. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ. వంగ‌వీటి, వైఎస్ రాజ‌శేఖ‌ర్ ఇలా.. కాంగ్రెస్‌లో ఎవ‌రో ఒక‌రు మ‌ర‌ణించిన‌పుడు హ‌స్తానికి తిరుగులేని మెజార్టీ ఇచ్చిన ఏకైక ఘ‌న‌త ఏపీ ఓట‌ర్ల సొంతం. కులం, మ‌తం అంటూ కొట్టుకులాడే ఈ ఓట‌ర్ల‌కు.. క‌న్నీరు పెట్టించే శోకం.. పాపం అనిపించే సంఘ‌ట‌న జ‌రిగితే చాలు.. సానుభూతితో  అటువైపు వంగిపోతారు. పాపం చంద్ర‌బాబు ప‌దేళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉన్నాడ‌ని.. 2014లో గెలిపించారు. 2019లో ఫాపం.. మ‌న వైఎస్ వార‌సుడు పాద‌యాత్ర‌లు చేస్తూ బిడ్డ ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో  ఒక్క ఛాన్స్ అంటున్నాడుగా చూద్దామంటూ ఓట‌ర్లు.. జ‌గ‌న్‌ను గెలిపించారు. అయితే.. ఇక్క‌డ కొద్దిగా తేడా ఉంది.. 2019లో ఎన్నిక‌ల్లో సానుభూతితోపాటు.. బాబుపై గాట్టి వ్య‌తిరేక‌త కూడా ఉంది. బాబు మీద అంటే.. ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం మీద‌నాలేమో..  కొట్ట‌డం .. క‌సితీరా కొట్ట‌డం వేర్వేరు. 2014కు ముందు ప‌దేళ్ల‌పాటు ఏలుబ‌డిలో ఉన్న కాంగ్రెస్ ఆరేళ్ల‌పాటు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాల‌న‌తో బాగా పుంజుకుంది. ఆయ‌న మ‌ర‌ణంతో 2009 త‌రువాత ప‌రిస్థితులు మారాయి. రోశ‌య్య‌, న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి సీఎంలుగా ఏం చేశారంటే.. ఏం చేయ‌లేదంటూ మ‌రో ప్ర‌శ్న ఎదుర‌వుతుంది. ల‌క్ష‌కోట్లు మాయ చేశారంటూ వైఎస్ పై అంత దుమ్మెత్తిపోసినా.. విప‌క్షాల‌న్నీ ఏక‌మైన కూట‌మి క‌ట్టినా 2009లో వైఎస్‌ను చూసి జ‌నం ఓట్లేశారు. కిర‌ణ్‌కుమార్‌రెడ్డి పాల‌న సూప‌ర్ అంటూ. జ‌నం మెచ్చుకున్నా ఎందుకో న‌ల్లారిని నాయ‌కుడుగా జ‌నం భావించ‌లేక‌పోయారు. 2014 ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్ చేసిన పెద్ద త‌ప్పిదం.. రాష్ట్ర విభ‌జ‌న‌. అదే ఏపీలో హ‌స్తం పార్టీను క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్క‌కుండా మార్చింది. అప్పుడు జ‌గ‌న్ గెలుపు గుర్రం ఎక్కేందుకు రెఢీగా ఉన్నాడు. కానీ.. కొత్త రాష్ట్రం అనుభ‌వం లేని జ‌గ‌న్‌తో పోల్చితే.. ప‌రిపాల‌న ద‌క్ష‌త ఉన్న నేత‌గా చంద్ర‌బాబును నెత్తిన పెట్టుకున్నారు. ప‌వ‌న్‌, న‌రేంద్ర‌మోదీ హ‌వా మ‌రింత క‌ల‌సివ‌చ్చింది. 2019 నాటికి బాబు అదే న‌మ్మ‌కాన్ని ఏపీ ప్ర‌జ‌ల్లో కొన‌సాగించ‌టాన్ని మ‌ర‌చిపోయారు. తానే ఏపీకు దిక్కు అనేంగా మితిమీరిన ఆత్మ‌విశ్వాసం బాబును రాజ‌కీయంగా చోటుచేసుకుంటున్న మార్పుల‌ను క‌నిపించ‌కుండా చేసింది. ప‌క్క‌న చేరిన భ‌జ‌న‌బ్యాచ్ కూడా తోడైంది. ఐదేళ్ల‌పాటు టీడీపీ నేత‌ల చుట్టూ మూగిన మందీమార్భ‌లం అందిన‌కాడికి దోచుకుంది. అవినీతి ఉన్నా.. ఏదో నామ‌కేవాస్త్ అనే బాబు పాల‌న‌లో మ‌రో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని చూశారు. క‌మ్మ వ‌ర్గ ప్రాభ‌ల్యం పెరిగింద‌నే అభిప్రాయం మిగిలిన సామాజిక‌వ‌ర్గాల్లో జీర్ణించుకుంది. దీంతో 2019లో క‌మ్మ వ‌ర్సెస్ నాన్‌క‌మ్మ అనేంత‌గా వైసీపీ విప‌రీత‌మైన ప్ర‌చారం చేసింది. పోల‌వ‌రం టెండ‌ర్లు, అమ‌రావ‌తి నిర్మాణాన్నిఉదాహ‌ర‌ణ‌లుగా చూపింది. అప్ప‌టికే చంద్ర‌బాబు కేవ‌లం ఉత్స‌వ విగ్ర‌హం అనే బ‌ల‌మైన అభిప్రాయం ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డింది. ప‌వ‌న్ గ‌ట్టి పోటీ ఇస్తాడ‌నుకున్నా.. ప‌వ‌న్‌, చంద్ర‌బాబు ఇద్ద‌రూ మిత్రులు అనే సంకేతాలు ప్ర‌జ‌లు కూడా విశ్వ‌సించారు. అందుకే… చంద్ర‌బాబును క‌సిగా ఓడించాల‌నే ల‌క్ష్యంతో బారులు తీరారు. జ‌గ‌న్ గెలిస్తే.. కొత్త‌వాడు కాబ‌ట్టి ఏదైనా చేస్తార‌నే న‌మ్మ‌కంతో గెలిపించారు. ఇలా.. జ‌గ‌న్ గెలిచాడు… బాబు ఓడార‌న్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here