మరాఠీ గడ్డపై జనసునామి సృష్టించిన ‘పవన్’ క్రేజ్

– ఎన్డీఏ కూటమి అంచనాలకు మించిన జన స్పందన
– రెండ్రోజుల మహారాష్ట్ర ఎన్నికల టూర్ సక్సెస్
– సనాతన ధర్మ పరిరక్షణపై మరాఠీల్ని ఆలోచింపజేసిన ‘జనసేనాని’ వ్యాఖ్యలు
– బహిరంగ సభల్లో తూటాల్లా పేలిన ‘పవన్’ పంచ్ లపై దేశవ్యాప్త చర్చ
—————-
అమరావతి:
మహారాష్ట్ర మరాఠీ గడ్డపై ‘జనసేనాని’ అడుగు రాజకీయ ప్రకంపనలు పుట్టించింది. ఆ రాష్ట్ర రాజకీయ వాతావరణంలో ముందెన్నడూ చూడని జన సునామి కనిపించింది. బీజేపీ పెద్దలు, ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్టు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలుగు తుఫాన్ అని మరోసారి నిరూపించుకున్నారు.

ఏపీ నుంచి ఎన్డీఏ కూటమి తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ క్రేజ్ బీజేపీ కూటమికి హైప్ నిచ్చింది. ఆయన రెండ్రోజుల ఎన్నికల పర్యటన బీజేపీ కూటమికి భారీ ప్లస్ కానున్నది. బీజేపీని కలుపుకొని కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టాప్ లేపిన సంగతి ఇప్పటికే అందరికీ తెలిసిందే. అద్భుతమైన మెజారిటీతో సర్కార్‌ ఏర్పాటు చేసింది. పొత్తులో ఉన్న పార్టీలుగా.. ఒకరికి ఒకరం సహకారం అందించుకోవాలి అన్నట్లుగా.. బీజేపీ పెద్దల అభ్యర్ధనను గౌరవించిన పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలోని తెలుగు ప్రాంతాల్లో రెండ్రోజులపాటు ప్రచారం చేశారు.

మరట్వాడా, విదర్భ, పశ్చిమ రీజియన్లలో జనసునామి..:

మహారాష్ట్రలో రెండురోజుల పాటు.. 5 సభలు, 2 రోడ్‌షోలలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో.. ఎన్డీఏ మహాయుతి అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేశారు. 16న నాందేడ్ జిల్లా డెగ్లూర్ నియోజకవర్గం బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. తర్వాత అదే జిల్లాలోని భోకర్ నియోజకవర్గంలో.. ఆ తర్వాత లాతూర్‌లో జరిగే మరో బహిరంగ సభకు హాజరయ్యారు. అదే రోజు రాత్రి షోలాపూర్ సిటీలో రోడ్‌షోలో పాల్గొన్నారు. 17న విదర్భ ప్రాంతం, చంద్రపూర్ జిల్లాలోని బల్లార్‌పూర్‌లో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పుణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో రోడ్ షోలో.. అక్కడి నుంచి కస్బాపేట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు.

మిన్నంటిన తెలుగు ప్రజల ఆదరణ:
మహారాష్ట్రలో తెలుగు ప్రజలతో పాటు మరాఠీలు పవన్ కళ్యాణ్ పర్యటనకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. మహాయుతి కూటమి ఫ్లెక్సీల్లో ఆంధ్రా డిప్యూటీ సీఎం, జనసేనాని ఫోటోలకు ప్రాధాన్యతనిచ్చి వాడుకున్నారు. సభల్లో పవన్ ప్రసంగాన్ని ఆసాంతం శ్రద్ధగా ఆలకించారు. గతంలోనూ కర్ణాటకలో బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. వారు పర్యటించిన ప్రాంతాల్లో తెలుగు వాళ్లు ఎక్కువగా ఉన్నారు. పైగా పవన్ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో పవన్ సభలతో అక్కడ ఓట్లు మరింతగా పెరిగే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. గతంలో తెలంగాణలోనూ ఎన్డీఏకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు.

ఆకట్టుకున్న ‘పవన్’ ప్రసంగాలు:

“నేను నా పిల్లలు ఇద్దరితో మరాఠీలో మాట్లాడుతాను. భాష మీద గౌరవంతో నేర్చుకున్నాను. విదేశీ భాషలు నేర్చుకునే మనం, మన సరిహద్దు రాష్ట్రాల భాషలు నేర్చుకోవాలి కదా. కనీసం 5 ప్రాంతీయ భాషలు నేర్చుకోవాలి. మన భాష, సంస్కృతిని నేర్చుకోవాలి” అని పవన్ కల్యాణ్ చెప్పారు.

”నేను ఆంధ్రలో మార్పు తీసుకొచ్చి చూపించాను, వైసీపీని ఓడించలేరు అంటే ఓడించి చూపించాను. ఇప్పుడు మీరు కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడానికి సిద్ధం కావాలి. మహారాష్ట్ర అభివృద్ది చెందాలన్నా, బల్లార్పూరు అభివృద్ది చెందాలన్నా, లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా మహారాష్ట్ర ఎదగాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించండి, ఓట్లు వేయండి, రోడ్లు మీదకు రావాలి” అని పవన్ కల్యాణ్ అన్నారు.

”భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే మహారాష్ట్ర లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ది చెందాలి. నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో తమిళనాడు సంస్కృతిని ప్రతిబింబించే సెంగోల్ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర అభివృద్ధి కోసం అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించేందుకు మీరు అందరూ ఓటు వేయాలి అని కోరుతున్నాను” అని చెప్పారు.

”500 సంవత్సరాల ఎదురుచూపులు తరవాత మనకు అయోధ్య రామ జన్మభూమి లో రామ్ లల్లా విగ్రహం ప్రతిష్ఠ జరిగింది. మన బలార్ష ప్రజల అదృష్టం ఆ ఆలయానికి తలుపులు ఇక్కడ టేకుతో తయారు అయ్యాయి” అని తెలిపారు.

”జనసేన పార్టీని బలంగా తీసుకెళ్లడంలో మహారాష్ట్ర స్ఫూర్తి కూడా ఉంది. ఒకరు ఛత్రపతి శివాజీ గారు, ఇంకొకరు హిందూ హృదయ్ సామ్రాట్ శ్రీ బాలసాహెబ్ ఠాక్రే గారు. బలాసాహెబ్ ఠాక్రే గారి పుణ్య తిథి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నాను” అని పవన్ చెప్పిన తీరు అక్కడ ప్రజలను తీవ్రంగా ఆకట్టుకుంది.

ధర్మపరిరక్షణకు ఎన్డీఏను ఎన్నుకోవాలనడంపై దేశవ్యాప్త చర్చ:
సనాతన ధర్మ పరిరక్షణపై పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. తీసుకున్న చర్యలు ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ‌భాగంగా వారి వ్యాఖ్యలు తీవ్రంగా ప్రభావం చూపనున్నాయి.
– బీజేపీ అంటే మతతత్వ పార్టీ కాదని, మానవత్వ పార్టీ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.
– బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లో హిందువులకు రక్షణ లేదు. భారత్‌లో ఇతర మతాల హీరోలనూ అభిమానిస్తారు. దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యం.. ఆ పార్టీని గెలిపించండి అని జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. లాతూర్‌లో బీజేపీ అభ్యర్థి అర్చన పాటిల్‌, నాందేడ్‌ జిల్లా భోకర్‌ నియోజకవర్గం అభ్యర్థి శ్రీజయ చవాన్‌ కోసం ఎన్నికల ప్రచారం చేశారు. లాతూర్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. నాందేడ్‌ జిల్లా బీజేపీ అభ్యర్థుల తరపున నిర్వహించిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌, సనాతన ధర్మం, దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యమని, ఆ పార్టీని గెలిపించాలని కోరారు. మహారాష్ట్రలో సనాతన ధర్మ రక్షణ కోసం ఛత్రపతి శివాజీ, శివసేన వ్యవస్థాపకుడు బాల్‌థాక్రే చేసిన సేవలను కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని చూడాలన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు, దేశ ప్రజల కల అయోధ్య రామమందిర నిర్మాణాన్ని నెరవేర్చారని అన్నారు. 30 కోట్లమంది గ్రామీణ మహిళలకు జనధన్‌ యోజన బ్యాంకు ఖాతాలను తెరిపించి స్వయం ఉపాధి కల్పిస్తున్నారని పేర్కొన్నారు. 12 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్‌ పథకాన్ని వర్తింపజేశారని తెలిపారు. పాలాజ్‌ సత్యగణేష్‌ ఆలయంలో పవన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థులతో మాట్లాడి.. ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. కాగా, బహిరంగ సభలో అభిమానులు కేకలు వేయడంతో ‘‘మీరంతా సరిహద్దు తెలంగాణ వాసులని అర్థమైంది’’అని పవన్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమ గడ్డ అని కొనియాడుతూ.. బండెనుక బండి గట్టి పదహారు బండ్లు గట్టి అనే పాటను పాడారు.

మహారాష్ట్ర కర్మభూమిగా పేర్కొంటూ..:
మహారాష్ట్ర నేల సంస్కృతి, సంప్రదాయాల కలబోతని, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ తన పోరాట పౌరుషం నింపిన గడ్డ అని పవన్‌ అన్నారు. డా.బీ.ఆర్‌ అంబేడ్కర్‌ లాంటి మహనీయులను దేశానికి అందించిన గడ్డ మహారాష్ట్ర అని.. కర్మభూమి అయిన మహారాష్ట్ర దేశానికి ఓ స్ఫూర్తి మంత్రమని పేర్కొన్నారు. పోరాటంలో ముందుండే మరాఠా ప్రజలను కలుసుకోవడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. జీవితంలో పదవులు ముఖ్యం కాదని… జాతి, దేశం కోసం పాటుపడే ఆలోచన అత్యుత్తమని నమ్మే బాల్‌థాక్రే సిద్ధాంతాలు తనకు స్ఫూర్తి అని చెప్పారు. అంత స్థాయిలో సూటిగా పవన్ కళ్యాణ్ అలా పిలుపునివ్వడంపై మరాఠీల మదిలో కొత్త ఆలోచనలు రేకెత్తించాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ.. పవన్ కళ్యాణ్ క్రేజ్ ను వాడుకుని ఎన్నికల్లో లాభపడేందుకు ఎన్డీఏ కూటమి చేసిన కసరత్తు అద్భుతమైన ఫలితాలు తెచ్చిపెట్టనున్నాయనడంలో సందేహమేలేదు. ఈ విషయంపై మహారాష్ట్ర తెలుగు ప్రజలే కాకుండా ఇక్కడున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం చాలా ఆసక్తి, ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here