రుతుస్రావం – మాట్లాడకూడని అంశమా?

మహిళకు ఆరోగ్యకరమైన రుతుస్రావం ఆమె ఆరోగ్యానికే కాక కుటుంభంతో పాటూ సమాజంలో సంతోషానికి ఎంతో కీలకం.  అయితే అభివృద్ది చెందుతున్న దేశాలలో ఎన్నో కట్టుబాట్లు, సాంప్రదాయాలు, సామాజిక అపోహలు, భయాల కారణంగా రుతుస్రావ ఆరోగ్య సమస్యలకు అవసరమైన చికిత్స అందడం లేదు.  నానాటికీ ఈ రుతుస్రావ ఆరోగ్య సమస్యలతో పాటూ పరిశుభ్రమైన వాతావరణంలో రుతుస్రావం అన్న అంశం మన దేశంలో నివసించే మహిళలకు పెద్ద సవాల్ గా మారింది.

రుతుస్రావం గురించి మాట్లాడడం భారత దేశ సమాజంలో ఇప్పటికీ చర్చించడానికి వీల్లేకుండా నిషేధించబడిన అంశం.  దేశంలో ఉన్న సాంప్రదాయాలు, కట్టుబాట్లు యుక్తవయస్సు కు చేరుతున్న అమ్మాయిలకు రుతుస్రావం పై సరైన అవగాహన కలిపించడంలో అడ్డంకిగా మారుతున్నాయి.  కనీసం తల్లులు కూడా యుక్తవయస్సుకు చేరుతున్న తమ అమ్మాయిలతో కూడా రుతుస్రావం మరియు యుక్తవయస్సుకు చేరడం పై సరైన అవగాహన కలిపించడానికి సిగ్గుపడుతున్నారనే చెప్పవచ్చు.

సరైన అవగాహన మరియు శిక్షణ లేకపోవడం

భారత దేశంలో 355 మిలియన్ల అమ్మాయిలు, మహిళలు రుతుస్రావ వయస్సులో ఉన్నారనేది అంచనా.  అయితే ఈ రుతుస్రావ నెలసరి కాలెండర్  సమయాలలో రుతుస్రావానికి సంబంధించిన పరిశుభ్రతకు చెందిన అంశాలలో ఇంకా గౌరవప్రదమైన లేదా సౌకర్యవంతమైన రీతిలో వ్యవహరించలేకపోతున్నారనేది నిరూపించబడిన సత్యం.  భారత దేశంలో నిర్వహించబడిన సర్వేల ప్రకారం షుమారు 71 శాతం మంది అమ్మాయిలలో వారి మొదటి పీరియడ్ మొదలయ్యే నాటికి రుతుస్రావమనే అంశంపై ఏ మాత్రం అవగాహన లేదని స్పష్టమైంది.

నేను ఎంతో బయపడ్డాను,  నాకేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు (మొదటి సారి పీరియడ్ వచ్చినపుడు), నాకు గాయం కాలేదు కాని జరుగుతున్నదానిని చూసి ఆందోళన చెందాను.  నేను స్కూలు నుండి ఇంటికి వచ్చాను త్వరగా కానీ మా అమ్మకు చెప్పాలంటే భయం వేసింది. ఎందుకంటే అసలేం జరిగింది తాను అడిగుతుంది కాబట్టి.  ఇది 13 సంవత్సరముల ఉత్తర ప్రదేశ్ గ్రామీణ కాన్పూర్ ప్రాంతంలో నివసరించే పింకీ అనే అమ్మాయి అనుభవం.

ఇలా పింకీ ఎదుర్కొంటున్న విచిత్రమైన సమస్యే భారత దేశంలోని అత్యధిక శాతం అమ్మాయిలు ఎదుర్కొంటున్నారు.  మొట్ట మొదటి సారి పీరియడ్ వచ్చినపుడు వారు సిగ్గు, భయం, ఆందోళనతో కూడిన మొదటి అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు.  అసలు ఇలా అమ్మాయిలకే ఎందుకు జరుగుతుంది, దీని వెనుక గల అసలు బయాలాజికల్ కారణాలేమిటి అన్న దానిపై సరైన అవగాహన లేక ఇదేదో పెద్ద జబ్బని వారు జడిసిపోవడం జరుగుతోంది.

అందుకే యుక్తవయస్సుకు వచ్చే అమ్మాయిలలో తలెత్తే పలు సందేహాలను తీర్చి వారిలో అవగాహన పెంచే ఉద్దేశ్యంతోనే ఆ సందేహాలకు వైద్య నిపుణుల ద్వారా సమాధానాలందిస్తున్నాం…..

సాధారణంగా అమ్మాయిలలో మొదటి సారి రుతుస్రావం ఎపుడు ప్రారంభమవుతుంది?

సాధారణంగా 12 సంవత్సరముల వయస్సులో అమ్మాయిలలో మొదటి సారి రుతుస్రావం జరుగవచ్చు.  అయితే 10 నుండి 15 సంవత్సరముల మధ్య జరుగడం సహజమే.  ఎందుకంటే ప్రతి అమ్మాయి శరీరానికి తనకు తగ్గట్టు షెడ్యుల్ ఉంటుంది కాబట్టి.  అమ్మాయిలకు ఎపుడు ఖచ్చితంగా పీరియడ్స్ వస్తాయో ఖచ్చితంగా చెప్పలేము కాని క్రింద పేర్కొన్న కొన్ని లక్షణాల కారణంగా మనం అంచనా వేయవచ్చు….

  • సాధారణంగా అమ్మాయికి మొదటి సారి రుతుస్రావం రావడానికి రెండు సంవత్సరములకు ముందుగా రొమ్ములో మార్పులు రావడం జరుగుతాయి.
  • అలానే జననాంగాల నుండి ఒక రకమైన ద్రవం రావడం జరుగుతుంది. దీనిని కనీసం రుతుస్రావం మొదటి సారి జరుగడానికి ఆరు నెలల ముందే గమనించవచ్చు

రుతుస్రావం ఎందుకు జరుగుతుంది?

అమ్మాయి శరీరంలో వచ్చే హార్మోన్ల ప్రభావం, వాటిలో మార్పు కారణంగా రుతుస్రావం జరుగుతుంది.  హార్మోన్లు రసాయిన రూపంలో ఉండే వాహకాలు. ఈ సమయంలో అమ్మాయిలో ఈస్ట్రోజిన్ మరియు ప్రొగెస్టోరోన్ అనబడే హార్మోన్లను గర్భాశయం విడుదల చేస్తుంది.  అలానే గర్భాశయంలో ప్రత్యేకమైన లైనింగ్ ను ఈ హార్మోన్లను తయారు చేస్తాయి.  ఈ లైనింగ్ కు వీర్యంతో కలసిన అండాలు అంటుకొని పిండం గా మార్పుచెందుతాయి.  అయితే అండాలు ఉత్పత్తి కాన సందర్భాలలో ఈ లైనింగ్ పూర్తిగా విచ్చిత్తి చెంది కారడం ప్రారంభిస్తుంది.  ఇదే ప్రక్రియ మరళా మరళా జరుగుతుంది.  ఇదంతా జరుగడానికి ఒక నెల సమయం పడుతుంది.  అందుకే అమ్మాయిలలో రుతుస్రావం నెలకొక సారి జరుగుతుంది.

మరి ఓయోలేషన్ లేదా అండోత్సర్గముకు పీరియడ్స్ కు ఉన్న సంబంధం ఏమిటి?

ఓయోలేషన్ లేదా అండోత్సర్గము అంటే అండాశయం నుండి అండాలు విడుదల కావడం అని అర్థం.  అమ్మాయి శరీరంలో విడుదల అయ్యే హార్మోన్లు అండాశయం నుండి అండాలు విడుదల కావడానికి దోహదపడుతాయి.  అక్కడ నుండి అది ఫోలోపిన్ అనబడే సన్నటి మార్గం గుండా పయనించి గర్భాశయానికి చేరుతాయి.  ఒక వేళ ఇలా చేరిన అండం, వీర్యంతో కలసి పిండంగా మారితే అది గర్భాశయంలో మరింత ముందుకు అభివృద్ది కి సిద్దమవుతుంది లేదంటే అది గర్భాశయం లైనింగ్ ను ధ్వంసం చేసి ద్రవించి పీరియడ్స్ కు కారణమవుతుంది.

రుతుస్రావం ప్రారంభమైన నాటి నుండి పీరియడ్స్ సకాలంలో వస్తాయి?

రుతుస్రావం ప్రారంభమైన మొదటి కొన్ని సంవత్సరములు అవి సకాలంలో రావు.  అది సహజమే.  మొదటి 2-3 సంవత్సరాల కాలం అమ్మాయిలలో రుతుస్రావం 4-5 వారాలలోగా వస్తుంది.

పీరియడ్స్ ప్రారంభమైన వెంటనే అమ్మాయికి గర్భం వచ్చే అవకాశముందా?

అవును.  పీరియడ్స్ ప్రారంభమైన వెంటనే అమ్మాయికి గర్భం వచ్చే అవకాశముంటుంది.  అంతే గాకుండా పీరియడ్స్ మొదటి సారి రావడానికి ఖచ్చితంగా కొంత సమయం ముందు కూడా అమ్మాయికి గర్భం రావచ్చు ఎందుకంటే అప్పటికే అమ్మాయి శరీరంలో హార్మోన్లు చురుకుగా ఉండి అవి అండాల విడుదల ప్రక్రియను ప్రారంభించి ఉంటాయి కాబట్టి.  ఈ సమయంలో అమ్మాయి లైంగిక చర్యలో పాల్గొంటే గర్భం వచ్చే అవకాశముంటుంది.  ఇది అప్పటికి మొదటి సారి పీరియడ్స్ రాకపోయినా జరుగవచ్చు.

సాధారణంగా పీరియడ్స్ ఎన్ని రోజులుంటాయి?

సాధారణంగా పీరియడ్స్ 5 రోజులుంటాయి.  అయితే కొన్ని సందర్భాలలో అది తక్కువ లేదా ఎక్కువ కావచ్చు.

సాధారణంగా ఏ కాల వ్యవధిలో పీరియడ్స్ సంభవిస్తాయి?

సాధారణంగా 4-5 వారాల కాల వ్యవధిలో పీరియడ్స్ వస్తాయి.  అయితే కొంత మంది అమ్మాయిలలో ఇది తగ్గవచ్చు లేదా పెరుగవచ్చు.

పీరియడ్స్ సమయంలో నేను పాడ్, టాంపన్ లేదా రుతుస్రావ కప్ లలో ఏది వినియోగించాలి?

పీరియడ్ల కాలంలో వచ్చే రక్తస్రావం దాచుకోవడానికి, శుభ్రపరచడానికి ఎన్నో సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.  అయితే అందులో మీకు ఏది సరిగ్గా సరిపోతుందో చూసుకోవడానికి కొంత మేర ప్రయోగాలు చేయకతప్పదు.  కొంత మంది అమ్మాయిలు ఒక సదుపాయం తమకు సౌకర్యవంతంగా ఉందని భావిస్తే మరి కొందరు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.

  • ఎక్కువ శాతం అమ్మాయిలు పీరియడ్స్ లో పాడ్ లను వినియోగిస్తుంటారు. సాధారణంగా పత్తితో తయారు చేయబడి రకరకములైన సైజ్ లలో ఇవి లభిస్తాయి.  వీటిని అమ్మాయిలు తమ తమ అండర్ వేర్ కు అతికించి వినియోగిస్తారు.
  • మరి కొంత మంది అమ్మాయిలు టాంపన్స్ తమకు సౌకర్యవంతంగా ఉంటాయని బావిస్తారు. ముఖ్యంగా క్రీఢాకారులు, ఆటలు, ఈతలలో పాల్గొనే వారు దీనిని వినియోగించడం జరుగుతుంది.  ఇది పత్తితో చేయబడిన ప్లగ్ లాంటి సాధనం.  అమ్మాయిలు దీనిని తమ జననాంగాలకు అడ్డుగా పెట్టుకోవడం ద్వారా రుతుస్రావ ద్రవాలను టాంపన్ పీల్చివేయడానికి వీలు కలిగిస్తారు.  అయితే దీనిని 8 గంటలకు పైగా వినియోగిస్తే టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనబడే ఇన్ఫెక్షన్ సంభవించవచ్చు.
  • ఇక మరికొంత మంది అమ్మాయిలు ఇపుడు రుతుస్రావ కప్ లను ఉపయోగిస్తున్నారు. దీనిని కూడా జననాంగాలలోనికి ప్రవేశ పెట్టడం ద్వారా ఈ కప్ లోనికి రుతుస్రావ ద్రవాలను మళ్లిస్తారు.  అలా చేరిన ద్రవాలను వారు కొంత సమయం తర్వాత పారవేసి శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

పీరియడ్స్ సమయంలో ఎంత రక్తం వస్తుంది?

పీరియడ్స్ లో ఎంతో రక్తం పోయిందని మనకి అనిపిస్తుంది.  కానీ మొత్తం పీరియడ్స్ కాలంలో కేవలం కొన్ని టేబుల్ స్పూన్ల రక్తం మాత్రమే మన శరీరం నుండి పోతుంది.  అయితే ఇతర ద్రవాల కారణంగా అమ్మాయిలు రోజులో 3 నుంచి 6 సార్లు తమ తమ పాడ్ ల వంటి సదుపాయాలను మార్చాలి ఉంటుంది.

పీరియడ్స్ అనేవి జీవితంతమంతా సాగుతాయా?

సాధారణంగా మహిలలు 45-55 సంవత్సరముల వయస్సు వచ్చే సరికి మెనోపాజ్ ప్రక్రియకు చేరుతారు.  ఈ సమయంలో పీరియడ్స్ పూర్తిగా నిలిచిపోతాయి.  అలానే మహిళలు గర్భవతులుగా ఉన్న సందర్భాలలో కూడా పీరియడ్స్ రావు.

ప్రీ మెన్ స్ట్రువల్ సిండ్రోమ్ (premenstrual syndrome) అంటే ఏమిటి?

ప్రీ మెన్ స్ట్రువల్ సిండ్రోమ్ (premenstrual syndrome) అంటే అమ్మాయిలలో పీరియడ్స్ సందర్భంగా వచ్చే శారీరక, మానసిక లక్షణాలలో ఏర్పడే మార్పులు.  భావోద్వేగాలు మారడం, విచారంగా ఉండడం, ఆందోళన, ఒత్తిడి, కడుపు ఉబ్బినట్లు ఉండడం, ఆక్నే వంటి లక్షణాలు దీనిలో భాగంగా ఉంటాయి.  ఇవి పీరియడ్స్ అయిన కొన్ని రోజులకు తగ్గిపోతాయి.

పీరియడ్స్ సమయంలో వచ్చే క్రాంప్స్ ను ఏం చేయాలి?

ఎక్కువ శాతం మంది అమ్మాయిలలో పీరియడ్స్ సమయంలో క్రాంప్స్ వస్తాయి.  అయితే అవి ఎక్కువగా ఇబ్బంది పెడితే వెచ్చబర్చిన పాడ్ ను కడుపు భాగంలో ఉంచడం లేదా వైద్యులు సూచించిన మందులు తీసుకోవడం చేయాలి.

ఇంకా పీరియడ్స్ సమయంలో మరేం సమస్యలను గమనించాల్సి ఉంటుంది?

సాధారణంగా అమ్మాయిలకు పీరియడ్స్ కాలంలో పెద్దగా సమస్యలుండవు.  అయితే క్రింద పేర్కొన్న లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి….

  • 15 సంవత్సరములు దాటినా పీరియడ్స్ ప్రారంభం కాకపోయినా
  • పీరియడ్స్ ప్రారంభమై రెండు సంవత్సరములు దాటినా అవి నియమిత కాలంలో రాకపోవడం అంటే 4-5 వారాల కాలంలో
  • పీరియడ్ కు పీరియడ్ మధ్య కాలంలో రక్తస్రావం జరుగడం
  • ఎక్కువ తీవ్రత కలిగిన క్రాంప్స్ ఏర్పడిన సందర్భాలలో మందులు వాడినా తగ్గక పోవడం
  • సాధారణ స్థాయికి మించి రక్తస్రావం జరుగుతుండడం
  • వారానికి మంచి పీరియడ్స్ కొనసాగడం
  • ప్రీ మెన్ స్ట్రువల్ సిండ్రోమ్ (premenstrual syndrome) లక్షణాలు తీవ్ర స్థాయిలో కొనసాగుతుండడం

అంతా మన మంచికే, ఆరోగ్యానికేసందేహాలు తీర్చుకొని ప్రక్రియను ఆనందంగా అనుభవించాలి

పీరియడ్స్ అనేవి సహజసిద్దంగా జరిగే ప్రక్రియ, అది అమ్మాయి జీవితంలో ఆరోగ్యకరమైన అంశం.  దానికి సంబంధించిన అంశాలపై అపోహలతో సరిగ్గా స్పందించకపోవడం, వాటితో ఆటలాడడం మాని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి.  ఒక వేళ అమ్మాయిలకు ఏమైనా సమస్యలు లేదా సందేహాలు వస్తే వెంటనే వైద్యులను, తల్లితండ్రులను, టీచర్లను, నర్స్ లను లేదా తన కన్నా పెద్ద వారైన మహిళలను సంప్రదించి వాటిని నివారించుకోవాలి.  తద్వారానే వారి జీవితం సంతోషంగా మారి ఈ ప్రక్రియను ఆనందంగా అనుభవిస్తారు.

Dr. Jayashree Reddy is a Infertility Specialist, Gynaecologist and Laparoscopic Surgeon (Gynaecology and Obstetrics), Apollo Cradle & Children’s Hospital, Hyderabad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here