జనసేనాని తో పాతికేళ్లు నడిచేందుకు సిద్ధమైన సైన్యం. రెండుచోట్ల ఓటమి తరువాత కూడా సేనానిపై అపారమైన నమ్మకం.. ఆయన వెంట నడవాలనే బలమైన సంకల్పం జనసైనికుల సొంతం అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికపై అధినేత పవన్ కళ్యాణ్ మాటే తమకు శిరోధార్యమంటున్నారు. పవన్ కూడా దీనిపై స్పష్టతనిచ్చారు. తిరుపతి లోక్సభ స్థానికి జరగబోయే ఉప ఎన్నికకు బీజేపీ పార్టీ అభ్యర్థిని బలపరచాలని నిర్ణయించారు. దీనిపై జనసేన పార్టీ విడుదల చేసిన ప్రకటన సారాంశం ఇదీ.
బి.జె.పి. జాతీయ స్థాయి నాయకులతో పలు దఫాలు జరిగిన చర్చల తరువాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము. ముఖ్యంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, బి.జె.పి. జాతీయ అధ్యక్షులు జే.పి.నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్లతో జరిపిన చర్చలలో తిరుపతి ఉప ఎన్నిక పై లోతైన చర్చ జరిగింది. ప్రముఖ పుణ్య క్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా వివిధ రంగాలలో అభివృద్ధిని చేస్తామని గట్టిగా వారు చెప్పారు. తిరుపతి అభివృద్ధితో వెనుకబడిన ఈ ప్రాంతం అభివృద్ధి ముడిపడి ఉందన్న విషయం మనకు తెలిసిందే. రాష్ట్ర ప్రగతికి, శాంతిభద్రతల పరిరక్షణకు ఈ నిర్ణయం మేలు చేస్తుంది. జనసేన అభ్యర్థి పోటీ చేయడం కంటే తిరుపతి నగరం అభివృద్ధి ముఖ్యమని భావించాం. అందరికీ ఆమోదయోగ్యుడైన, బలమైన అభ్యర్థి ఉన్నట్లయితే తప్పకుండా ఈ స్థానాన్ని బి.జె.పి.కి వదిలిపెడతామని ఆది నుంచి చెబుతూ వస్తున్నాం. బి.జె.పి. ప్రతిపాదించిన అభ్యర్థికి విజయం సాధించగల సత్తా ఉందని భావించిన తరువాతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. అంతే కాకుండా తిరుపతి లోక్ సభ స్థానాన్ని 1999లో బి.జె.పి. కైవసం చేసుకున్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం. ఆలయాలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాటి రక్షణకు బి.జె.పి. తగు చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం కూడా ఉంది. అంతేగాకుండా రాష్ట్రంలో ఆరాచక శక్తుల పీచమణచడానికి హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల మాదిరిగా తిరుపతిలో పోరాటం చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జె.పి. నాయకత్వం సమాయత్తం అవుతోంది. ఈ మేరకు రాష్ట్ర బి.జె.పి. అగ్ర నాయకులు పలుమార్లు జరిగిన ఉభయ పార్టీల సమావేశాలలో స్పష్టం చేశారు. వైయస్సార్సీపీ ఆగడాలకు ధీటైన సమాధానం చెబుతామని వారు చెబుతున్నారు.
జనసేన శ్రేణులకు ఈ సందర్భంగా ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా… జనసేన పార్టీ పక్షాన మేము ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీ, పార్టీతోపాటు నాయకులు, జెండా మోసే కార్యకర్తలు సంస్థాగతంగా బలపడడానికే అని జన సైనికులు గమనిస్తారని ఆశిస్తున్నాను. వై.ఎస్.ఆర్.సి.పి. అరాచకాలు నిన్నటి పంచాయితీ, నేటి మున్సిపల్ ఎన్నికలలో మనం చూస్తూనే వున్నాము. ఇటువంటి అరాచక శక్తులను ఎదుర్కోవడానికి బి.జె.పి.తో కలసి ముందుకు సాగుతున్నాము. తిరుపతిపై నిర్ణయాన్ని దూరదృష్టితో జనసేన శ్రేణులు ఆలోచిస్తాయని ఆశిస్తున్నాను. తిరుపతిలో విజయం కోసం సమష్టిగా కృషి చేద్దామని మీకు మనవి చేస్తున్నాను.