దారెంట పోతుండగా అమ్మవారి గుడిలో ఓ సన్నివేశం కంటపడింది.
– అది అమ్మవారి ఆలయం. పూజారి నోట అమ్మవారి స్తోత్రపఠనం గట్టిగా వినిపిస్తుంది. కారులో ఓ ధనిక భక్తుడు ఆలయ దర్శనానికి వచ్చిన కాసేపట్లో ఒక కానిస్టేబుల్ కూడా అక్కడికొచ్చాడు. ఆ తర్వాత కొడుకు గ్రహదోషాల నివారణార్ధం శాంతిపూజల కోసమని ఓ సామాన్య భక్తుడూ వస్తాడు. వారికి ఆశీర్వచనాలు చదవడంలో పూజారి తీరు ఒకింత స్వార్ధపూరితంగా నడుస్తుంది. దండిగా కానుకలు వేసే వారికి ఒకరకంగా.. ఒక మోస్తరు భక్తులతో మరో రకమైన ప్రవర్తన పూజారి నైజంగా కనిపిస్తుంది.
గుడి లోపల పరిస్థితి అలా ఉంటే…
– గుడి బయట యాచకురాలు తన సంచిలో చిల్లర పైసల్ని దేవుని హుండీలో వేస్తూ.. “అందరూ చల్లగా ఉండాలి” అని అమ్మవారికి దండం పెడుతుంది.
పూజారిలో ఆశ్చర్యం..
– ‘ఏవిఁటే తులశమ్మా… నువ్వు రోజూ చేసే పని..?? భిక్షాటనతో పోగేసిన పైసల్ని దేవుని హుండీలో వేస్తున్నావ్..?? భవిష్యత్తు కోసం దాచుకోకుండా నువ్వు చేసే పద్ధతేమీ బాగోలేదు..?? ” అని ప్రశ్నిస్తాడు.
“అయ్యా…కోపగించుకోవద్దయ్యా.. భిక్షాటన సొమ్మును నా అవసరాలు తీర్చుకున్నాక మిగిలిన సొమ్మును ” నేనేం చేసుకుంటాను “. ఇక భవిష్యత్తంటారా…అదంతా అమ్మవారే చూసుకుంటుంది” అని యాచకురాలు తులశమ్మ చెప్పిన సమాధానం అందరికీ షాక్..
– డబ్బే ప్రపంచంగా, సంపాదనే ధ్యేయంగా బ్రతికే వారి మస్తిష్కాలను రిపేరు చేసిన సమాధానం అది. సాక్షాత్తూ అమ్మవారి స్వరూపంగా మాట్లాడి మనసుల్ని కడిగేసిన తులశమ్మ చెప్పిన “నేనేం చేసుకుంటాను” అనే డైలాగ్ ఆధ్యాత్మిక సారానికి మూలం.
– ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు..
మంచి మనసుతో చెప్పే నాలుగు మాటలు కూడా ఎదుటివాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయని ..
ఆలయానికి వచ్చిన భక్తులకు తులశమ్మ చెప్పే ఉపదేశాలు… సర్వ సమస్యల పరిష్కారానికి మానవాళికి సాధన అత్యవసరమని తెలియజెప్పే సన్నివేశం చూశాను.
నేను చూసి చెప్పింది కథ కాదు. కళ్లు తెరిపించిన దృశ్యం.
శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అభినయ థియేటర్ ట్రస్ట్, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ మరియు యశోద ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నారా చంద్రబాబు నాటకోత్సవంలో గురువారం (17/10/24) రాత్రి పూర్ణోదయ ఆర్ట్స్, చీరాల వారి “నేనేం చేసుకుంటాను” నాటిక ఒక దృశ్యకావ్యం.
ప్రేక్షకులను కట్టిపడేసిన అద్భుతం.
రచన : శ్రీ కృష్ణమూర్తి వంజారి కాగా దర్శకత్వం: శ్రీ పూర్ణ సత్యం గారు.
– రచయిత మనసులో అనుకున్న భావానికి న్యాయం చేసిన దర్శకుడు కనిపించాడు. అనవసర డైలాగులు, కదలికల్లేని సన్నివేశాలతో పాత్రలు సజీవ శిల్పాలుగా ప్రేక్షకులకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించాయి.
– సీనియర్ కళాకారులు శ్రీ పూర్ణ సత్యం గారు, సోదరి అమృతవర్షిణి, మిత్రులు చిలకలూరిపేట ప్రసాద్ గారు, ఆర్టీసీ వరప్రసాద్ గారు పాత్రల్లో ఒదిగిపోయారు. సంగీత మాంత్రికుడు లీలామోహన్ వాయించిన రాగాలు నాటికకు బలాన్నిచ్చాయి.
– ‘భగవంతుని చైతన్యం’ లేని పదార్థానికీ ఉనికి ఉండదు. ‘ఎవ్వనిచే జనించు జగమెవ్వరి లోపల నుండు లీనమై..’ అంటూ కేవలం భాగవత సారం ఆధారంగా సాగిన స్తుతిని ఓమారు పరిశీలిస్తే తత్వం బోధపడుతుంది. ఒక మనిషి జీవన పెరుగుదల లేదా ఎదుగుదల, పతనం, అంత్యదశ అన్నిటికీ మూలం ఆ ఆదిశక్తి పరమాత్మే. కనుక, ఆ అమ్మవారిపై భారం వేసి మన కర్తవ్యాలను, స్వధర్మాన్ని ఆచరించడమే ఉత్తమం. అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః… (భగవద్గీత:10.32). అన్ని విద్యలలో ‘అధ్యాత్మ విద్యయే గొప్పది’. లౌకిక విద్యలన్నీ కేవలం పొట్టకూటి కోసమే. కూడు, గూడు, గుడ్డ.. వీటికోసం ఏర్పడినవే. ‘ఇవి అనవసరం’ అని ఎవరూ అనరు.
– మానవుడు సంఘజీవి. మానవునికే సాధన ద్వారా ఉన్న స్థితినుండి ఉన్నత స్థితికి పొందే అవకాశం ఉంది. ఈ అవగాహనలో సాధకునికి తోడ్పడేది అధ్యాత్మ విద్య. దీనిద్వారా మాత్రమే వ్యక్తి ముక్తిని పొందటానికి అవసరమైన సాధన చేయగలడు. ఏది తెలుసుకుంటే ఇక వేరేది తెలుసుకోవలసిన అవసరం ఉండదో అదే ‘అధ్యాత్మ విద్య’. విద్యలన్నిటిలోకి ఇదియే రారాజు. ‘ఆ అధ్యాత్మ విద్యయే నేను. వాదించేవారిలో వాదనా పఠిమను నేను’ అంటుంది అమ్మవారు.
– అధ్యాత్మ విద్య నేర్చిన వ్యక్తి మౌనిలా, ప్రశాంత వదనంతో ఉంటాడు. ఎన్ని సమస్యలు వచ్చినా తొణకడు. ఎవరైనా విమర్శించినా చిరునవ్వే సమాధానం అవుతుంది.
– ఆ చిరునవ్వుతోనే నాటికలో వృద్ధురాలి పాత్ర పోషించిన సోదరి అమృత వర్షిణి అమ్మవారి స్వరూపంగా కనిపించారు. రంగాలంకరణ, ఆహార్యం మెచ్చుకోవాల్సిందే…
– ముఖ్యంగా మా బాబాయి పూర్ణ సత్యం గారికి, నా ఆత్మీయ మిత్రులు సీహెచ్ ప్రసాద్ గారు, విజయవాడ ఆర్టీసీ వరప్రసాద్ కి మరీమరీ అభినందనలు.
– ఎప్పుడూ కుటుంబాలు, గొడవలు, అమ్మా నాన్న, అన్నదమ్ములు సెంటిమెంట్ లతో మూసధోరణిలో నడుస్తున్న నాటికలనే చూస్తున్నాం. కానీ, రచయిత కృష్ణమూర్తి వంజారి గారు కొత్తగా ఆలోచించి ఒక పాయింట్ చుట్టూ ” నేనేం చేసుకుంటాను ” నాటిక తయారు చేయడాన్ని ఆదరించాల్సిందే.
– ఆధ్యాత్మిక అంశాలను ముడిపెట్టి రచన చేయడమే పెద్ద సాహసం. సీనియర్ సినీ దర్శకులు కె. విశ్వనాథ్ గారు ఇలాంటి ప్రయోగాలు చేశారు.
– అలాంటిది రచయిత గారి పాయింట్ కి తగ్గట్టుగా పూర్ణ సత్యం గారి దర్శకత్వం యువతరానికి ఆదర్శం
– పొగర్తి నాగేశ్వరరావు
– జర్నలిస్టు, ఆర్టిస్ట్
– సృజన కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు
– గుంటూరు
– 9381243599