పొలిటికల్ రోల్ మోడల్ ‘పవన్ కళ్యాణ్’

– అసెంబ్లీకే వన్నెతెచ్చిన ప్రసంగశైలి ఆయన సొంతం
– కూటమి ప్రభుత్వం తెచ్చిన మార్పుపై స్పస్టతనిచ్చిన జనసేనాని
– అనుభవజ్ఞునిగా చంద్రబాబు మరోపదేళ్ళు సీఎం అంటూ ఆశక్తికర వ్యాఖ్యలు
– స్నేహధర్మం విస్మరించని నేతగా పవన్ కు మరోమారు గుర్తింపు
– ఊహించనిరీతిలో వినిపించిన ‘పవర్ పంచ్’ లపై సర్వత్రా చర్చ
——————-
అమరావతి:

‘పవన్ అంటే ఓ వ్యక్తికాదు.. తుపాను’ అని ప్రధాని మోదీ అన్న మాటలు వాస్తవమే. చిన్న గాలితెమ్మెర వలే మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం ఏపీలో రాజకీయ ప్రభంజనమే సృష్టించింది. ఓ పెనుతుపానుగా మారి వైకాపా అరాచక ప్రభుత్వాన్ని కూల్చేసింది. రాజకీయ సునామీ అంటే ఏమిటో జగన్ సర్కారుకు తెలిసొచ్చేట్లు చేసిందనేది అందరికీ తెలిసిన విషయమే. తాజాగా బుధవారం జరిగిన అసెంబ్లీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం చేశారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన పరిపాలనా మార్పు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనుభవజ్ఞత అవసరాన్ని గుర్తు చేస్తూ ఆయన మాట్లాడిన అంశాలు తీవ్ర సంచలనమై చర్చనీయాంశానికి దారితీశాయి. అసెంబ్లీలో వారు అనుసరించిన అణుకువ తీరుకు రాజకీయాలలో తల పండిన నేతలు సైతం అబ్బురంతో ముచ్చటపడ్డారు.
సీఎం చంద్రబాబుకు మాట ఇస్తున్నానని.. మేం చేయాల్సిన పనులపై ఆదేశాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరడం విశేషం. సీఎం చంద్రబాబు విజన్‌కు తగ్గట్టు పనిచేస్తామని.. సీఎం కలలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉండాలని.. చంద్రబాబు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.

అనుభవాలను పాఠాలుగా..:
సమర్థులైన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందనేది చంద్రబాబును చూసి తెలుసుకోవచ్చని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో ప్రశంసించారు. విజయవాడ వరదల సమయంలో అధికార యంత్రాంగాన్నని దగ్గర ఉండి నడిపిన తీరు అభినందనీయమని …తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా ఉండటానికి చంద్రబాబు ముఖ్య కారణమని గుర్తు చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బుడమేరుకు వరదలు వచ్చాయని .. ప్రతినెల ఒకటో తేదీన కూటమి ప్రభుత్వంలో వేతనాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియలేదన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు ఈ ప్రభుత్వానికి సవాల్ గా మారాయని అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పని చేశామని గుర్తుచేస్తూ… కూటమి ప్రభుత్వం తెచ్చిన ప్రత్యక్ష మార్పుపై జనసేనాని స్పష్టతనిచ్చారు.

కూటమిపై మరింత నమ్మకం పెంచే ప్రయత్నమే..
బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి కట్టడంలో ఆది నుంచి వ్యూహాత్మక శైలితో పవన్ కళ్యాణ్ దూసుకెళ్తున్నారు. ఆ క్రమంలోనే ఊహకందని విధంగా పవన్ నోట చంద్రబాబు మరో పదేళ్లు సీఎం అనే ప్రకటన రావడం రాజకీయవర్గాలను సహజంగానే ఆశ్చర్య పరుస్తోంది. పవన్ మాత్రం రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉందని..సీఎంగా ఆ తర్వాత కూడా మరో పదేళ్లు కొనసాగాలని అన్నారు. దీంతో ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో ఎనలేని నమ్మకం ..కూటమిపై విశ్వాసం పెరగడంలో సందేహమేమీ లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

రాజకీయాల్లో అరుదైన శైలిలో ‘పవన్’:

కారణం ఏదైనా చంద్రబాబు నాయకత్వం విషయంలో పవన్ కల్యాణ్ చాలా స్పష్టతతో ఉన్నారు. ఎక్కడా ఎలాంటి ఊహాగానాలకు తావివ్వని విధంగా తనదంటూ ప్రత్యేకమైన రీతిలో నడుస్తోన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్ల అన్ని వైపులా సానుకూలత లభిస్తుంది. ఇందులో భాగంగానే మంగళవారం ఆయన ప్రవేశపెట్టిన పంచాయతీ రాజ్ సవరణ బిల్లుకు శాసన మండలిలోని వైఎస్ఆర్ సీపీ సభ్యులు సైతం మద్దతు పలికారు. ఇటీవలి కాలంలో ఆయన సనాతన ధర్మం నినాదం తీసుకుని జాతీయస్థాయిలో తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. ఏదేమైనప్పటికీ, ఎక్కడ నెగ్గాలో కాకుండా ఎక్కడ తగ్గాలో తెలిసిన నేతగా పొలిటికల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందరి ప్రశంసలు పొందుతున్నారు. స్నేహధర్మం ఎన్నడూ విస్మరించని నేతగా చంద్రబాబు అనుభవజ్ఞతపై మరోమారు పవన్ తన విధేయతను చాటడం రాజకీయాల్లో ఒక అరుదైన సంస్కృతిగా చూడాలంటున్నారు మేధావులు. ప్రజలకు మంచి చేయడమే ధ్యేయంగా రాజకీయాలలో అడుగిడిన జనసేనాని సంచలనాత్మక ఆలోచనలను రాజకీయ దిగ్గజాలు సైతం ఆసక్తికరమైన రీతిలో గమనిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here