కొన్ని పగలు.. ప్రతీకారాలు మనసులో మండుతుంటాయి. అవకాశం దొరికినపుడు అవి బుసలు కొడుతుంటాయి. దీనికి ఎవరూ అతీతులు కాదు. ఆంధ్రప్రదేశ్ వంటి చోట్ల ఇట్టాంటి పోకడలు ఎక్కువగానే కనిపిస్తాయి. సినిమా రాజకీయంలో గతానికి భిన్నంగా ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పటికిప్పుడే మొదలైనవి కాదు. సినిమా, రాజకీయం రెండు కులంతో పడిపడి ఉన్నవే. మద్రాసులో తెలుగోడు వెండితెరపై విజయాలు సాధించి.. స్టార్ లుగా ఎదిగారు. అక్కడ తెలుగు ఆత్మగౌరవం అంటూ తమిళనాట కూడా గొంతు వినిపించారు. అందాకా ఎందుకు.. అమెరికా, జర్మనీ అస్ట్రేలియా వంటి పెద్ద దేశాల్లో ఎవరైనా తెలుగోడు గెలిచి అధికారం సంపాదిస్తే.. అది తెలుగోడు గొప్ప. అదే తెలుగోడికి పక్క రాష్ట్రం వాడు బద్ద శత్రువు. మొన్న జరిగిన మా ఎన్నికల్లో జరిగిన రాజకీయం కూడా ఇదే. ఇదంతా చిరంజీవి కుటుంబం చుట్టూ చాలా ప్రేమగా.. అప్యాయతగా ఉంటూ బిగించిన ఉచ్చు.
మనం చేస్తే శృంగారం.. పక్కోడైతే వ్యభిచారం అనే విషయాన్ని మా ఎన్నికల్లో గెలిచిన డాక్టర్ మంచు మోహన్బాబు అండ్ కో.. ఆయన కోసం బట్టలు చించుకుని విలువలు మరచిన మీడియా చేస్తున్న ప్రచారమే ఇందుకు ఉదాహరణ. ది గ్రేట్ లెజెండ్ ఆత్మగౌరవం అంటే నిలువుటద్దమంటూ గొప్పగా జబ్బలు చరచుకుని చెప్పుకునే కీర్తి శిఖరం ఎన్టీఆర్ పుత్రరత్నం బాలకృష్ణ ఎమ్మెల్యే అది కూడా టీడీపీ నుంచి. కానీ.. మొన్న ఓటు మాత్రం.. టీడీపీను పాతాళానికి తొక్కేయాలని భావిస్తున్న వైసీపీతో అంటగాకుతూ.. చెట్టపట్టాలేసుకునే మంచు కుటుంబ వారసుడు విష్ణుకు ఓటేశాడు. ఇది స్వయంగా మోహన్బాబే చెప్పారు. అల్లుడు లోకేష్ను ఓడించేందుకు తాను ప్రచారం చేస్తే.. తన కొడుకు గెలుపును బాలయ్య భుజానకెత్తుకున్నాడని.. ఇది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన టీడీపీ భజన బ్యాచ్.. చూశారా.. మా బాలయ్యగొప్ప మనసు అంటూ అదేదో ఘన కార్యం చేసినట్టు తెగ మురిసిపోతున్నారు. అదే చిరంజీవి.. విష్ణు వర్గానికే ఓటేసి ఉంటే.. చూశారా.. తమ్ముడు అంటే ఎంత వ్యతిరేకతో అంటూ కలాన్ని అలా తిప్పేవారు.
ఇదంతా.. కేవలం మెగాఫ్యామిలీను సినిమా రాజకీయంగా దెబ్బతీయాలి. దీనికి కులం రంగు పులిమి.. కాపులను ఒంటరి చేయాలనే దురాలోచన కూడా లేకపోలేదు. అయితే.. కాపులను కొడుకులంటూ పేర్ని తో తిట్టించినా.. అంబటి లాంటి తొత్తులు అవాకులు పేలినా.. కాపు సామాజికవర్గం నిన్నటిలా లేరు. ఎందుకంటే.. వ్యవసాయం నుంచి బయటకు వచ్చి.. చదువు, వ్యాపార ఉద్యోగరంగాల్లో ఎదిగారు. ఆర్ధికంగా బాగానే పుంజుకున్నారు. తరం మారుతున్న కొద్దీ కాపు యువతలో చైతన్యం వస్తోంది. గొడవలు మాని సహకరించుకుంటున్నారు. ఇప్పుడు జనసేనకు కాపు కాసేందుకు సిద్ధమయ్యారు. ఇది కేవలం కృష్ణ, గుంటూరు జిల్లాలకే కాదు.. శ్రీకాకుళం తూర్పు కాపుల నుంచి.. రాయలసీమ బలిజలు. తెలంగాణ మున్నూరు కాపుల వరకూ చేరింది. నిన్నటి ఆవేశాన్ని వదిలేసి.. ఓర్పును ఒంటపట్టించుకుని.. జనసేన తరపున యుద్ధం చేసేందుకు సైనికులుగా మారుతున్నారు. మెగా ఫ్యామిలీ చుట్టూ ఎంత ముళ్ల కంచె వేసినా తెగించి కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.