ఆంధ్ర ప్రదేశ్ రాజధాని పై శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ ఏం చెప్పింది ?

2014లో కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్ప‌డినా.. వాస్త‌వానికి కొత్త‌గా నిర్మించుకోవాల్సిన రాష్ట్రం మాత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌. ఈ విష‌యంలో పాల‌క‌, ప్ర‌తిప‌క్ష‌పార్టీల‌న్నీ విఫ‌ల‌మ‌య్యాయి. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవ‌టంలోనూ వెనుక‌బ‌డ్డాం. దీనికి కార‌కులు ఫ‌లానా అని చెప్ప‌టం చాలా క‌ష్టం. ఎందుకంటే తిలాపాప త‌లా పిడికెడు అన్న‌ట్టు దాదాపు అన్ని పార్టీలు అవే త‌ప్ప‌టడుగులు వేశాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ద్రోహం చేశాయనేది నిష్టూరంగా అనిపించిన కాద‌న‌లేని వాస్త‌వం.

రాష్ట్ర విభజన సమయం లో ఆనాటి యూపీఏ ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటుచేసింది. ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం కి అనుగుణంగ ఏ ప్రాతం లో రాజధాని నిర్మిస్తే బాగుంటుంది అనేది తేల్చ‌మ‌ని ఆదేశించింది. ఈ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి కొన్ని సిఫార్సులు చేసింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే రాజధాని ఏ ప్రాంతం లో రాజ‌ధాని ఏర్పాటు చేయాలి అనే స్పష్టత నివ్వలేక‌పోయింది. తాను కూడా ఒక అభిప్రాయానికి రాలేక‌పోయింది.

ఈ కమిటీ చేసిన సూచనలో ముఖ్యమైనది అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం గాకూడ‌దు. వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగే విధంగా రాజ‌ధాని నిర్మాణం జ‌ర‌గాల‌ని సూచించింది. పంట పొలాలును రాజధాని నిర్మాణకి సేకరించకూడదనేది కీల‌క‌మైన అంశం. దీనివ‌ల్ల సాగు వైశాల్యం త‌గ్గి వ్వ‌వ‌సాయ ఉత్పత్తుల దిగుబడి తగ్గుతుంద‌నే అభిప్రాయం వెలిబుచ్చింది. ఇది రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్థితిపై ప్ర‌భావం చూపుతుంద‌ని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి సాగు లో లేని ప్రభుత్వఅటవీ భూములను డిఫారెస్ట్ చేసి నిర్మణాలకి అనువుగా వుండే ఇతర భూములను సమీకరించాలి అని సూచించింది.

ఈ కమిటీ ని కానీ ఈ కమిటీ సిఫార్సులు పైన కానీ 2014 లో విభాజిత ఆంధ్ర ప్రదేశ్ కొత్త ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదనే విమ‌ర్శ‌లున్నాయి. ఈ కమిటీ సిఫార్సుల పై అసెంబ్లీ లో కానీ మంత్రి వర్గం లో కానీ చర్చించలేద‌నేది కాద‌న‌లేని వాస్త‌వం. వారి ఆలోచన‌ల‌కు అనుగుణంగా నాటి పుర‌పాల‌క మంత్రి నారాయణ నేతృత్వం లో క‌మిటీ ని ఏర్పాటు చేసి విజయవాడ కేంద్రంగ ఆ కమిటీ సిఫార్సుల ప్రకారం రాజధానిని ఏర్పాటు చేయబోయితున్నట్లు ప్రకంటించటం జరిగింది. ఇందుకు అప్ప‌టి ప్రతిపక్ష నాయకు డు జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా స‌మ్మ‌తి తెలిపారు.

ఈ పరిస్థితుల్లో రాజధాని విజయవాడ ప్రాంతాల్లో ఎక్కడ వస్తుంద‌నేది గోప్యంగా ఉంచారు. మైల‌వ‌రం, నూజివీడ‌, దొన‌బండ ఇలా.. నానా ర‌కాల పేర్లు వెలుగులోకి వ‌చ్చాయి. దీన్ని అవ‌కాశం చేసుకుని రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు భారీగా భూములు కొనుగోలు చేశారు. ఈ గోప్య‌త వ‌ల్ల దాదాపు అన్ని పార్టీల్లోని నేత‌లు భూముల‌కు పెట్టుబ‌డి మ‌ళ్లించారు. దీనివ‌ల్ల‌నే బారీగా ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగిందంటూ వైసీపీ నేత‌లు ఆరోపించారు

 – తాటి రామ‌కృష్ణారావు, అధ్యాప‌కులు, సామాజిక‌-రాజ‌కీయ విశ్లేష‌కులు

 

1 COMMENT

  1. నిజమైన విషయాలు చెప్పారు.. ఆ రోజు ప్రతిపక్షం కాదన్న పట్టించుకొనే పరిస్థితి లేదు. రాజధాని కోసం ఉన్న పంటలను నిలువునా ప్రొక్లైన్ తో తొక్కిస్తుంటే కళ్ళ నీళ్లు పెట్టిన వారిలో నేను ఒకడిని….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here