గోదావరిపోటెత్తుతోంది. వరదనీటితో పల్లెలను ముంచెత్తుతోంది. ముంపు గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకున్నారు. ఇటువంటి క్లిష్టమైన సమయంలో అదికారులంతా సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. బాధితులను తమ ఇంటి సభ్యులుగా భావించి సహాయం అందించాలని సూచించారు. గోదావరి వరద పరిస్థితులపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద పరిస్థితులపై కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నేను ఏరియల్ సర్వేకు వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను కాబట్టి మీరు సహాయ పునరావాస కార్యక్రమాలను వదిలి రావాల్సిన అవసరంలేదు. అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నానని సీఎం జగన్ తెలిపారు. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, బిసి సంక్షేమ శాఖ మంత్రి సీహెచ్ వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఇతర అధికారులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కొంటికి రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఖర్చు విషయంలో వెనుకాడ వద్దని సీఎం స్పష్టం చేశారు. మంగళవారం రాత్రికి 17 లక్షల క్యూసెక్కులకు, రేపు ఉదయానికి 12 లక్షల క్యూసెక్కులకు, గురువారానికి 8 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గుతుందన్న సమాచారం వస్తోంది. వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలి. 10 రోజుల్లోనే యథాతథస్థితికి తీసుకురావాలని జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు