కడప జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్యతో ప్రొద్దుటూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇది నాణేనికి ఓ వైపు మాత్రం.. ఇది వైసీపీ, టీడీపీ మధ్య ఉన్న వైరం తారాస్థాయికి చేరిందనే సంకేతాలు వస్తున్నాయి. నందం సుబ్బయ్య అంతిమయాత్రలో పాల్గొనేందుకు టీడీపీ నేత ఎమ్మెల్సీ లోకేష్ ప్రొద్దుటూరు వెళ్లనున్నారు. ప్రశాంతంగా ఉన్న సీమలో మళ్లీ ప్రతీకార హత్యలు మొదలవటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ దాడులతో టీడీపీ తమ్ముళ్లు ఊళ్లు వదలి వెళ్లిపోయారు. ప్రస్తుతం అది సీమ జిల్లాలకూ పాకింది. నందం సుబ్బయ్య హత్య వెనుక స్థానిక ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డి, ఆయన బావమరిది ఉన్నాడంటూ నందం సుబ్బయ్య భార్య ఆరోపించారు. ఇసుక మాఫియా, మట్కా, జూదం, క్రికెట్ బెట్టింగ్లతో అధికార పక్షం ఆగడాలను ప్రశ్నించినందుకే సుబ్బయ్య హత్య జరిగిందంటూ టీడీపీ నేతలు ఆరోపించారు.
దీనిపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి సంచలనమైన అంశాలు వెల్లడించారు. నందం సుబ్బయ్య అనే వ్యక్తిపై 14 కేసులున్నాయి. అతడు ఎంతో మంది మహిళలను బలాత్కరించాడు. ఒక కేసులో ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. మహిళల పట్ల అతడి ప్రవర్తనతో కడుపుమండిన ఎవరో చంపేసి ఉంటారంటూ ఎమ్మెల్యే అనుమానాలు వ్యక్తంచేశారు. ఇప్పటి వరకూ కేసుల విషయం బయట పెట్టకుండా ఇప్పుడు పాత కేసులను చూపుతూ తమ నేత హత్యను పక్కదారి పట్టించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ టీడీపీ నేతలు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఏమైనా నందం సుబ్బయ్య హత్యతో సీమలో మరోసారి ఫ్యాక్షన్ దందాకు తెరదీసినట్టయింది.