రాజోలులో రాపాకకు షాకిచ్చిన జనసైనికులు. బీమవరంలోనూ గ్రంధికి చుక్కలు చూపారు. గాజువాకలో రాబోయే మున్సిపోల్స్లో బరిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. జనసేనకు అసలు గుర్తింపు లేదంటూ ధీమాగా ఉన్న ప్రత్యర్థులకు పంచాయతీ ఎన్నికలు షాక్ ఇచ్చాయనే చెప్పాలి. బీమవరం నియోజకవర్గంలోని పలు పంచాయతీ స్థానాల్లో జనసేన బలపరచిన అభ్యర్థులు గెలుపొందటం.. ఎమ్మెల్యే సార్కు గుర్రు తెప్పించింది. అంతే.. తన వాళ్లతో గెలిచిన మహిళా అభ్యర్థులపై దాడులు చేయించటం.. కారులు తగుల పెట్టేంత వరకూచేరటంపై జనసైనికులు పవన్కు ఫిర్యాదు చేశారు. సున్నితంగా మాట్లాడుతూనే తూటాల్లాంటి మాటలు సంధించగల సేనాని తనదైన శైలిలో పంచ్లు విసిరారు. పిచ్చికుక్కలను పట్టుకునేందుకు మున్సిపాలిటీ వ్యాన్ వస్తుందంటూ అభిమానులకు ధైర్యంచెప్పారు. తేడాలొస్తే తాడోపేడో తేల్చుకునేందుకు మేమంతా సిద్ధమంటూ హెచ్చరించారు. పాపం.. ఇలాంటి హెచ్చరిక ఇప్పటి వరకూ చవిచూడని సదరు ఎమ్మెల్యే గ్రంథికి పాపం బాగానే బాధేసినట్టుంది. అంతే.. జనసైనికులు ఆకురౌడీలని.. పవన్ స్టేట్ రౌడీ అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు. దమ్ముంటే రమ్మంటూసవాల్ విసిరినంత పనిచేశారు. ఎర్రకండువా కప్పుకున్నవాళ్లు తాను రాగానే పారిపోయారంటూ ఎద్దేవాచేశాడు. దీంతో జనసైనికులు కూడా నియోజకవర్గ వారీగా సత్తా చాటేందుకు మరోసారి సన్నద్ధమయ్యారు. తమ నాయకుడు ఇచ్చిన భరోసాతో పవన్తో భారీ ర్యాలీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఈ లెక్కన… మున్ముందు గ్రంథి సార్కు ఇంకెంతగా ఉలికిపాటు మొదలవుతుందో.. మరెంతగా జనసైనికులపై నోరు పారేసుకుంటారో.. తన వాళ్లతో దౌర్జన్యాలకు పాల్పడతారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఏమైనా.. పంచాయతీ ఎన్నికల్లో జనసేన ఊహించని విధంగా సర్పంచ్ స్థానాలు గెలవటం.. భవిష్యత్ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో పెంచింది. ఇదే మున్సిపల్ ఎన్నికల్లో నిరూపించుకోవాలని జనసైనికులు, బరిలో ఉన్న అభ్యర్థులు ఉన్నారు.