కాంగ్రెస్ కీలక నేత.. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్రెడ్డి వారసురాలు వైఎస్ షర్మిల. తాజాగా యూనివర్సిటీ విద్యార్థులతో లోటస్పాండ్లో సమావేశమయ్యారు. సుద్దులు. బుద్దులు బాగానే చెప్పారు. అమ్మాయిల వెనుక అబ్బాయిలు నిలబడి రక్షణ కల్పించాలన్నారు. రాజకీయంగా.. సామాజికంగా ముందుకు రావాలంటే రాజన్నరాజ్యం తెలంగాణలో తెచ్చితీరునాంటూ మంగమ్మశపథం చేసినంత పనిచేశారు. ఇంతకీ.. అసలు షర్మిల కొత్త పార్టీ వెనుక ఎవరున్నారు. జగన్ నడిపిస్తున్నాడా! లేకపోతే బీజేపీ ఆడిస్తున్న రాజకీయ డ్రామానా! కేసీఆర్ చక్రం తిప్పిస్తున్నాడా! ఏమో.. ఎవరి లెక్కలు వారికి అయినా.. షర్మిల కొత్త పార్టీతో పోయేదేముంది.. బ్యాలెట్ పేపర్లలో మరో పేరు రావటం తప్ప అని లైట్ గా తీసుకున్న నేతలు లేకపోలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బీటలు పడేలా చేసిన వైఎస్సార్ను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా! అనే అనుమానం లేకపోలేదు. అయితే.. దీన్నుంచి బయటపడేందుకు షర్మిలమ్మ తాను తెలంగాణ కోడలనంటూ కొత్త పల్లవి అందుకున్నారు. పైగా కోడలిగా ఇక్కడ నాకు హక్కు ఉందంటూ గర్వంగా చెబుతున్నారామె. ఇంతకీ ఓటు హక్కు ఎక్కడ ఉందని మాత్రం అడగొద్దంటూ విపక్షాలు సెటైర్లు కూడా వేస్తున్నాయి. ఏమైనా.. ఒక రాజకీయపార్టీను ఏర్పాటు చేసి నడిపించటం.. అధికారంలోకి తీసుకురావటం పుస్తకం చదివినంత ఈజీ కాదేది షర్మిలకూ తెలుసు. అయినా ఎవరో వెనుక నుంచి నడిపిస్తున్నారనేది మాత్రం అందరిలోనూ తొంగిచూస్తున్న అనుమానం.